రైల్వే శాఖపై మంత్రి హరీశ్ రావు అసహనం

రైల్వే శాఖపై మంత్రి హరీశ్ రావు అసహనం

సిద్ధిపేటలోని రంగదాంపల్లి రైల్వే స్టేషన్, దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 10కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను నిర్మాణ పనులను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం మరింత పెంచాలని సూచించారు. కేవలం 5 కిలోమీటర్ల మేర ట్రాక్ చేపట్టాల్సి ఉందని రైల్వే శాఖ అధికారులు మంత్రికి వివరించారు. 

సిద్ధిపేట- రంగదాంపల్లి రైల్వే స్టేషన్ పనులు మందకొడిగా సాగుతుండడంపై రైల్వేశాఖపై మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. మందపల్లి వద్ద అండర్ పాస్, కుకునూరుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసిన మంత్రి... పనులు పూర్తి చేయాలని రైల్వేశాఖ అధికారులకు ఆదేశించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల రాక, స్టేషన్ నిర్మాణంపై రైల్వేశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి సమాలోచనలు చేశారు.

మంత్రి హరీష్ రావుతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.