
- ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీపడ్డా మనకే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్–2025 పోటీలు కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని.. తెలంగాణను ప్రపంచానికి తెలియజేసే గొప్ప అవకాశమని టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ పోటీలను నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతాయని, మన దేశంలోనూ వివిధ రాష్ట్రాలు మిస్ వరల్డ్ వేడుకను నిర్వహించేందుకు ప్రయత్నించగా.. తెలంగాణకు ఆ చాన్స్ దక్కిందన్నారు.
140 దేశాల నుంచి పోటీదారులు, ఆయా దేశాల నుంచి ప్రతినిధులు, మీడియా కూడా వస్తుందని తెలిపారు. ఇది తెలంగాణ పర్యాటకానికి ఎంతో ఉపకరిస్తుందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు, ఎక్సైజ్ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు ‘వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఎంతో మేలు
మిస్ వరల్డ్-–2025 పోటీలు హైదరాబాద్లో జరగడం తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే మంచి అవకాశమని జూపల్లి కృష్ణారావు తెలిపారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం బాగా ప్రమోట్ అవుతుంది. హైదరాబాద్లోని సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలు, ఆధునిక సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చే అతిథులకు పరిచయమవుతాయి. ఈ పోటీల వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హోటళ్లు, రవాణా, ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం సంబంధిత రంగాల్లో వేలాది ఉద్యోగాలు వస్తాయి.
ఈ కార్యక్రమం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డినాయకత్వంలో ఈ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నాం. ఈ పోటీలు రాష్ట్రానికి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో మేలు చేస్తాయి. వ్యతిరేకతలను సానుకూల దృక్పథంతో స్వీకరిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని చర్యలూ తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
సేల్స్ పెరగలే.. ట్యాక్స్తో కొంత ఆదాయం పెరిగింది
ఎక్సైజ్ శాఖలో కొత్త మద్యం బ్రాండ్లకు ఇయ్యాల కొత్తగా అనుమతులు ఇవ్వడం లేదని, గతంలో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. ‘‘కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువస్తే మార్కెట్లో పోటీని పెంచి, నకిలీ మద్యం అమ్మకాలను అరికడతాయి. మద్యం షార్టేజీ ఉండదు. కృత్రిమ కొరత సృష్టించడానికి అవకాశం కూడా ఉండదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు అన్ని నిబంధనలనూ పాటిస్తూ, పారదర్శకతతో అనుమతులు ఇస్తున్నాం.
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. కానీ మేం దాన్ని సరిదిద్దుతూ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. లిక్కర్ ఆదాయం 2 శాతం పెరిగింది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో మొదట్లో రూ.9 వేల కోట్లు వస్తే.. 2023 డిసెంబర్ సమయానికి ఎక్సైజ్ ఆదాయం రూ.35 వేల కోట్లకు చేరింది. మా ప్రభుత్వంలో 17 నెలల కాలంలో అంతే ఆదాయం ఉంది. సేల్స్ పెరగలేదు. కాకపోతే ఇటీవల కొంత రేట్లు పెంచడంతో 2 శాతం ఆదాయం పెరిగింది. బెల్ట్ షాప్లపై ఉక్కుపాదం మోపుతున్నాం. గతం కంటే ఎక్కువ కేసులు మా ప్రభుత్వంలో నమోదు కావడమే ఇందుకు ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అంతా ఏకఛత్రాధిపత్యమే..
కేసీఆర్ ప్రభుత్వంలో తాను 2014లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహించానని, ఆనాడు మంత్రులకు కనీస విలువ కూడా ఇవ్వలేదని మంత్రి జూపల్లి గుర్తు చేసుకున్నారు. ‘‘ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులు గేటు దాకా వెళ్లి లోపలికి రానియ్యకపోతే కండ్లల్లో నీళ్లు పెట్టుకుని వెనక్కి వచ్చారో నాకు తెలుసు. ఎవరి మాట వినేవాళ్లు కాదు. చెప్పనిచ్చే పరిస్థితులు కూడా లేవు. అంతా ఏకఛత్రాధిపత్యం. కానీ కాంగ్రెస్ సర్కారులో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అలా లేదు. అందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మంత్రులు ఎవరైనా.. ఎప్పుడైనా కలిసి ఏదైనా చెప్పుకోవచ్చు.
ప్రజాకేంద్రీకృత పరిపాలనపై దృష్టి పెట్టినం. పారదర్శకత, జవాబుదారీతనం, సంస్కరణలు మా ప్రభుత్వ బలం. రేవంత్ యువ నాయకత్వంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్న 25 ఏండ్ల సభలోనూ కేసీఆర్ చేసిన ఆరోపణలు ఆయనకే సూట్ అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరుల కుటుంబాలకు, అమరుల ఆత్మలకు దు:ఖం ఉన్నది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన్రు. ఆ అప్పులకే రూ.6 వేల కోట్లు వడ్డీలు, కిస్తీలు పోతున్నాయి. అయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, సన్న వడ్లకు బోనస్, 200 యూనిట్లకు ఉచిత కరెంట్, ఉద్యోగాల భర్తీ ఇంకా అనేక స్కీమ్స్ అమలు చేస్తున్నాం. కొన్నింటికి కొంత టైం పడుతుంది. కాంగ్రెస్ విలన్ అనకపోతే.. కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ఉండదు. అందుకే అలా మాట్లాడుతున్నరు” అని జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఏ పదవిలో ఉన్నా ప్రజలకు సేవ చేస్తా..
కేబినెట్ విస్తరణ జరిగితే తన మంత్రి పదవి పోతుందనేది ఊహాగానాలు మాత్రమేనని మంత్రి జూపల్లి తెలిపారు. ‘‘రాజకీయాల్లో ఊహాగానాలు సహజం. నా దృష్టి పూర్తిగా నా శాఖల బాధ్యతలను నిర్వహించడంపైనే ఉంది. కేబినెట్ విస్తరణ అనేది సీఎం, పార్టీ హైకమాండ్ నిర్ణయం. నేను ఎప్పుడూ పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటా.
అది ఏ పదవిలో అయినా సరే. పైగా నేను ఎప్పుడూ ఎవరిని పదవుల కోసం అడుక్కోలేదు. గతంలో 2018లో నేను ఓడిపోయిన సమయంలో కేటీఆర్ నన్ను పిలిచి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మీకు సూటబుల్గా ఉంటుందని.. నాన్న (కేసీఆర్)ను అడగాలని చెప్పారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను” అని వెల్లడించారు.
ఖర్చు చేసేది తక్కువే
మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ప్రస్తుతం ఖరారు చేసే దశలో ఉన్నాయని, మొత్తంగా రూ.5 కోట్లలోపే ఖర్చు చేస్తున్నామని మంత్రి జూపల్లి వివరించారు. మిగతా మొత్తం స్పాన్సర్స్ నుంచి వస్తుందని తెలిపారు. అయినా ప్రభుత్వం చేసే కొంత ఖర్చు కూడా పర్యాటక రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడి అని వెల్లడించారు. ‘‘హైదరా బాద్ను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చడాని కి ఇలాంటి కార్యక్రమాలు అవసరం. గతంలో ఫార్మూలా ఈ రేస్ నిర్వహిం చారు. ఎలాంటి అనుమతులు లేకుం డా విదేశాలకు రూ.50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు.
మేం అలా చేయడం లేదు కదా ? పారదర్శకంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణలో పర్యాటక రంగానికి అపార సామర్థ్యం ఉంది. హైదరాబాద్, వరంగల్, నాగార్జున సాగర్, యాదాద్రి వంటి ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. నాగార్జునసాగర్లో స్టార్ హోటల్ నిర్మాణం, బుద్ధవనం అభి వృద్ధి, హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటివి మా ప్రధాన ప్రాజె క్టులు. ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం తో కాటేజీలు, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాం” అని వెల్లడించారు.