హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో ఒవైసీ జంక్షన్లో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు ఐటీ, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్. కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, బల్దియా మేయర్ , ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు , కార్పొరేటర్లు హాజరయ్యారు. 63 కోట్ల రూపాయల వ్యయంతో 1.36 కిలోమీటర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ కు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ గా పేరొందిన ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
కాగా, హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లకు చెక్ పెట్టడానికి రూపొందించిన SRDP రోడ్లు ఒక్కోటి ప్రారంభమవుతున్నాయి. నగరంలోని జంక్షన్ల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్న జనానికి రిలీఫ్ కలగనుంది. గ్రేటర్లో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పూర్తవుతుండటంతో చాలా జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీగా మారనున్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 29 వేల 695 కోట్లతో SRDP పనులను GHMC చేపట్టింది.
చార్మినార్ జోన్ లోని సంతోష్ నగర్ జంక్షన్, ఒవైసీ జంక్షన్, చాంద్రాయణ్ గుట్ట, ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు, బహదూర్ పూరా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఉన్న ఈ OYC జంక్షన్ ప్లై ఓవర్ మంగళవారం ప్రారంభమవుతోంది. 1.4 కిలో మీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ తో రెండు జంక్షన్లలో 95 శాతం ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు స్పీడ్ గా వెళ్తాయంటున్నారు బల్దియా ఇంజనీర్లు. ఈ SRDP ప్రాజెక్టు ద్వారా పాత నగరంలో చాలా వరకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కు చెక్ పడుతుందంటున్నారు.
333 కోట్ల రూపాయలతో నిర్మించిన షేక్ పేట్ ప్లై ఓవర్ దాదాపు 2.8కిలో మీటర్ల దాకా ఉంది. మోహదీపట్నం నుంచి ఐటీ ఏరియాకు వేగంగా ట్రాఫిక్ వెళ్లేందుకు వీలవుతుంది. అన్ని పనులు పూర్తయిన ఈ ఫ్లై ఓవర్ కూడా ఒకట్రెండు రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. ఐటి ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా కూకట్ పల్లి JNTU నుంచి గచ్చిబౌలీ బయోడైవర్సిటీ జంక్షన్ వరకు చేపట్టిన జంక్షన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో రెండు అండర్ పాస్ లు, 4 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లో చేపట్టిన SRDP ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 7 వేల 89కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ పూర్తయితే IT ఏరియా, ఓల్డ్ సిటీతో పాటు మెయిన్ జంక్షన్లలో చాలా చోట్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడే అవకాశముంది.