ఫాల్గుణమాసం పండుగల మాసం.. ఈనెలలో ప్రాంతీయ ఆచారాలు గౌరవిస్తారు. కుల దేవతలకు పూజలు చేస్తారు. ఫాల్గుణమాసం శుక్ల పక్షం పూర్వ ఫల్గుణి(పుబ్బ)రోజుకు కేరళలో చాలా విశిష్టత ఉంది. . కేరళ మహిళలు అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్ ను ఘనంగా జరుపుకుంటారు. ఆపండుగ ఎలా జరుపుకుంటారు. దాని విశిష్టత ఏమిటి.. మొదలగు విషయాలు తెలుసుకుందాం. . .!
ఫాల్గుణమాసం శుక్ల పక్షం పూర్వ ఫల్గుణి(పుబ్బ) నక్షత్రం ( 2026, మార్చి3) కేరళలో అట్టుకల్ పొంగల్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతుంది. కేరళలో పుబ్బ నక్షత్రాన్ని పూరం అంటారు. తిరువనంతపురం అట్టుకల్ భగవతి ఆలయంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి….వంటలు వండి పండగ చేసుకుంటారు. ఈ సందర్భంగా అటుకుల దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహిళలు. వండిన నైవేద్యాన్ని అటుకుల దేవికి సమర్పిస్తారు. కేరళలో ఎంతో పవిత్రంగా భావించే ఈ ఫెస్టివల్ కోసం ఆరోజున తెల్లవారుజాము నుంచే మహిళలు పూజలు చేయడం మొదలుపెడతారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, వంటకాలు చేస్తారు. రోడ్డుపై బారులు తీరుతూ వరుసగా వంటకాలు వండుతారు.
అట్టుకల్ పొంగల్ పండుగ తేది ఇతర వివరాలు
- అట్టుకల్ పొంగల్ తేది:మార్చి 3 మంగళవారం
- పూరం ( పుబ్బ) నక్షత్రం ప్రారంభం: మార్చి 3 ఉదయం 07:31 గంటలకు
- పూరం ( పుబ్బ) నక్షత్రం ముగింపు: మార్చి 4 ఉదయం 07:39 గంటలకు
అట్టుకల్ పొంగల్ అంటే ఏమిటి?
అట్టుకల్ పొంగలా అనేది అట్టుకల్ అమ్మవారికి అంకితం చేయబడిన 10 రోజుల ఆలయ పండుగ. వేడుకలు మలయాళ మాసం మకరం లేదా కుంభంలో కార్తిగై నక్షత్రంలో ప్రారంభమవుతాయి మరియు రాత్రిపూట జరిగే సాంప్రదాయ ఆచారం అయిన కురుతితర్పణంతో ముగుస్తాయి.
కేరళ సంప్రదాయంలో ఈ పండుగ 9 రోజులు జరుగుతుంది. చివరి రోజు అంటే ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్ష పక్షం పుబ్బ నక్షత్రం రోజు పొంగల్ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజున మహిళా భక్తులు బియ్యం, బెల్లం, కొబ్బరి, నెయ్యితో తయారుచేసిన పొంగలి అమ్మవారికి నైవేద్యంగా వండుతారు.
అట్టుకల్ పొంగల్ పండుగ ప్రాముఖ్యత
ఈ పండుగ రోజు అమ్మవారిని పూజించి నైవేద్యం సమర్పించడం వలన కుటుంబం వృద్ది చెందుతుందని విశ్వసిస్తారు. కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తారు. అమ్మవారి దయతో కోరిన కోరికలు తీరుతాయని భావిస్తారు. మహిళలందరూ కలిసి అమ్మవారిని ధ్యానిస్తారు.
అట్టుకల్ పొంగల్ పండుగ ఎలా జరుపుకోవాలి
ముందుగా వంట చేసేందుకు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఆ ప్రదేశంలో నీళ్లు చల్లి బియ్యం ప్పిండి తో ముగ్గు వేయాలి. ఇటుకలతో పొయ్యి ఏర్పాటు చేసుకోవాలి. పొయ్యి వెలిగించిన తరువాత అక్కడ కొబ్బరికాయను కొట్టి.. తరువాత పొంగలిని మట్టి కుండలలో తయారు చేయాలి. పొయ్యిని వెలిగించేందుకు ముందుగా అమ్మవారిని దర్శించుకొని అక్కడ హారతి ఇచ్చి ఆ హారతితో వెలిగించాలి. దీని వలన అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. వంట చేసిన తర్వాత, నైవేద్యాన్ని ఆలయ పూజారులచే అమ్మవారిని నివేదించాలి. ఈ పండుగకు కేరళ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు.. విదేశాల నుండి కూడా లక్షలాది మంది మహిళలు వస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
