జోగులాంబ గద్వాల జిల్లాలో వింత ఘటన..మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు..!

జోగులాంబ గద్వాల జిల్లాలో వింత ఘటన..మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు..!

జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ దగ్గర ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓ పూజారి మొసలి ముందు కూర్చొని పుసుపు కుంకుమ చల్లి పూజలు చేశాడు. ఆదివారం ( ఆగస్టు 9 ) జరిగినఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. 

►ALSO READ | పెద్దపల్లిలో మందు ఉచితంగా ఇవ్వలేదని.. వైన్ షాప్ పై దాడికి దిగిన మద్యం ప్రియులు... 

విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు.

మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా ఈ ఘటనతో భక్తులు, సందర్శకులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మరి, ఆ వరుణ దేవుడు కరుణిస్తాడా లేదా చూడాలి.