ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్లో పర్యటించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. రేపు జిల్లాకు మంత్రి కేటీఆర్ వస్తున్నారు.. కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో జనసమూహం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేటీఆర్ పర్యటనలో మొదటగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారని.. ఆ తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కరీంనగర్ పట్టణంలో 24 గంటల త్రాగు నీటి పథకానికి, ఐటీ టవర్ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కరీంనగర్కు తలమానికంగా తయారవుతున్న కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ పరిశీలిస్తారని వెల్లడించారు. ఐటీ టవర్స్ ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడుతూ.. ఐటీ టవర్ ద్వారా 3,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.. ఇప్పటికే 17 కంపెనీల నుండి ఎంవోయూలు కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.