అమరావతి: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలిస్తున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదని ఆయన చెప్పారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని చెప్పారు.
ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆర్టీసీ విలీనానికి అంగీకరించారని మంత్రి చెప్పారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనని, విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. ఆర్టీసీ విషయంలో విభజన జరగలేదన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఎలా కేటాయించింది..? మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు.