Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్,రావల్పిండిలను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలుగా ప్రకటించింది. టీమిండియా మ్యాచ్ ల వేదిక విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పాకిస్థాన్ లో భారత్ పర్యటించనందున హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. చివరిసారిగా 2017 లో ఛాంపియన్స్ జరిగింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పై పాకిస్థాన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది.   

"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మేము పంపాము. మేము పాకిస్తాన్‌లో చాలా మంచి టోర్నమెంట్‌ని నిర్వహించేలా  ప్రయత్నిస్తున్నాం". అని నఖ్వీ లాహోర్‌లోని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ మాత్రం పాక్ ‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది.

సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భారత జట్టు లేకపోతే టోర్నీ కళ తప్పడమే కాకుండా, లాభాలలో భారీగా గండి పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ద్రుష్టి పెట్టింది. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి.