మణుగూరు, వెలుగు: విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మణుగూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులతో కలిసి మండలంలోని తోగ్గూడెం గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న రెడ్డి కల్యాణ మండపానికి భూమిపూజ చేశారు.
అనంతరం రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న లంకమల్లారం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు వెళ్లే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి, రూ.2.70 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల హాస్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సర్పంచ్ పూణెం రమేష్, ప్రిన్సిపాల్ రాణి తదితరులు
పాల్గొన్నారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో..
కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండలం లింగారంతండా గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం, యంత్రం, నవగ్రహాలు, జంట నాగులు, స్థిర విగ్రహ యంత్రం, నాభిశిల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు.

