
- మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శ
- కాంగ్రెస్ ప్రభుత్వం పూర్వ వైభవం తెస్తుందని హామీ
బషీర్ బాగ్, వెలుగు : 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. పదేండ్లు అధికారంలో ఉండి గ్రంథాలయాలపై దృష్టి పెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్విమర్శించారు. ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పద్మశ్రీ డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా సోమవారం అఫ్జల్ గంజ్లోని రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఎస్.ఆర్.రంగనాథన్ ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్మాట్లాడారు. ప్రతిఒక్కరూ పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల్లోని ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలని, టీజీపీఎస్సీ ద్వారా సీఎంతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ లో పెట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రంగనాథన్ స్ఫూర్తితో ప్రతి మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో కేరళలో కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీతో మాట్లాడి, నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని రియాజ్ మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రంథాలయాల ఉద్యోగులకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏవీఎన్ రాజు, గెజిటెడ్ గ్రంథ పాలకులు పీజీవీ రాణి, 33 జిల్లాల నుంచి వచ్చిన గ్రంథ పాలకులు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.