హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ‘మోడల్’గా అభివృద్ధి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
దేవాలయాల అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్పర్సన్ బంక చందు, సర్పంచ్లు, కౌన్సిలర్లు తదితరులున్నారు.
