రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖైరతాబాద్ లోని రవాణా శాఖా కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఉద్యోగులందరికీ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. రాబోయే రోజుల్లో మరింత లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలి. అందుకోసం రవాణా శాఖ నుంచి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సిబ్బంది, ఉద్యోగులు కోనుగోలు చేయడమే కాకుండా వారి వారి బంధువులకు కూడా ఎలక్ట్రికల్ వాహనాల ప్రాధాన్యతను వివరించాలి. రవాణా విభాగంలో ఏ వ్యక్తి కార్యాలయానికి రాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారుల సేవల్ని మరింత విస్తరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం త్వరలో నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఈ మేరకు అధికారుల, ఉద్యోగుల సహకారంతో పాటు సృజనాత్మక ఆలోచనల అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇంకా 10 నుంచి 12 దాకా ఆన్లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. కోవిడ్ సమయంలో రవాణా శాఖ ప్రజలకు అందించిన సేవలు అభినందనీయం. ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా, డ్రైవర్ల అందరికీ వాక్సినేషన్ ఏర్పాటు వంటి చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కరోనా విపత్కర పరిస్థితులను తట్టుకుని రవాణా శాఖ సిబ్బంది, అధికారులు తమ విధుల్ని నిర్వహించడం ప్రశంసనీయం. గత సంవత్సరం అన్ని శాఖలు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి.. ఈ సమయంలో సేవా దృక్పధంతో అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగింది’ అని మంత్రి అజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి విజేంద్ర బోయి, తదితర ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సరం-2022 సందర్భంగా జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడమైంది(1/2).@TelanganaCMO @MinisterKTR @KTRTRS @tsrtc @TSRTCHQ @tsrtcmdoffice @Govardhan_MLA pic.twitter.com/b9VUwbF7XA
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) January 1, 2022
మంత్రి ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారం మరువలేనివి
- రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
రవాణా శాఖ లక్ష్యాలను అధిగమించే దిశలో అందరి ప్రయత్నం అవసరమని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు అన్నారు. ప్రభుత్వ సహకారం, మంత్రి ప్రోత్సాహంతో శాఖ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో మంత్రి మార్గనిర్ధేశంలో మెరుగైన సేవలు అందించడం జరిగిందని, సిబ్బంది పూర్తి సహకారం మరవలేదన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రవాణా శాఖ పురోభివృద్ధి కోసం ఈ ఏడాది మా వంతు పాత్ర పోషిస్తున్నామని ఆయన చెప్పారు.
For More News..
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది