
ఇబ్రహీంపట్నం, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో కరువు ప్రాంతం సస్యశ్యామలం కానుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ రాజ్ డివిజన్ , పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ ఆఫీసులను ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలో సీఈ, ఎస్సీ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించడం ఎన్నో ఏండ్ల కల, నేడు ప్రాజెక్ట్ తుది దశలో ఉందన్నారు. ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి వచ్చి కరువు ప్రాంతం సస్యశ్యామలంగా మారనుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, పంచాయతీ రాజ్ అధికారులు, నేతలు పాల్గొన్నారు.