
ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ఓపికతో ఉండాలని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి మంత్రి సీతక్క కల్గచేసుకుని బీఆర్ఎస్ చర్చను పక్కదారిపట్టిస్తుందన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఓపిక పట్టాలన్నారు. పదేళ్లలో అధికారంలో ఉండి..మీరెందుకు ఉద్యోగాలివ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్లలో కూడా రైతురుణమాఫీ చేయలేదని విమర్శించారు.తాము ఒకే సారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క హామీని పూర్తి చేస్తున్నామన్నారు.
గత పదేళ్లలో కూడా బీఆర్ఎస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ మొదటి బడ్జెట్ కే బీఆర్ఎస్ బయపడుతోందన్నారు. సుధీర్ఘ ప్రసంగాలు వద్దని సూచించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాటతప్పలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.