అంబర్పేట డీడీ కాలనీలో అక్టోబర్ 29న కిడ్నాప్ కు గురైన రియల్టర్ మంత్రి శ్యామ్ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇవాళ 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. శ్యామ్ ను తన మొదటి భార్య మాధవి లతే కిడ్నాప్ చేయించిందని చెప్పారు. శ్యామ్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆస్తి పంపకాల్లో విభేదాలు రావడంతో మాధవిలత కిడ్నాప్ చేయించిందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. అంబర్పేట్ డీడీ కాలనీలో అక్టోబర్ 29వ మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.కోటి50లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు శ్యామ్ను అపహరించారని పోలీసులు గుర్తించారు. వారు రెంట్ కార్లలో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో మంత్రి శ్యామ్తో వివాహం చేసుకొని మూడు సంవత్సరాల వ్యవధిలోనే విడాకులు తీసుకున్నారు.. గత మూడు సంవత్సరాలుగా ఆమె భర్తకు దూరంగా ఉంది. బాధితుడు శ్యామ్ తన పేరును అలిగా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తండ్రి నుంచి వచ్చిన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం.ఈ గ్యాంగ్ ప్రధాన సూత్రధారి సాయి అనే వ్యక్తి రామనగర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. మరో నిందితురాలు జీ.ప్రీతి లేడీ బౌన్సర్గా పనిచేస్తుండగా, ఎల్.సరిత అనే మరో మహిళ బాధితుడు ఉన్న అపార్ట్మెంట్లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి, అతని కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు చెప్పారు.
బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుడు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. శ్యామ్ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.
