
- ‘యశోద’లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, వెలుగు: “విప్లవాత్మక ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భాగస్వామ్యం” అనే అంశంపై దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాన్ని యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీ బ్రాంచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, వైద్య పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఏఐ ఎక్స్పర్ట్స్సహా వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెక్నాలజీతో కూడిన భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో కీలకమని అన్నారు.
ఇవి ఆరోగ్య సంరక్షణలో ఏఐ ప్రాముఖ్యతపై అవగాహనను పెంచుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రజారోగ్యం, పౌర సేవలకు ఏఐ కీలకమని మంత్రి స్పష్టం చేశారు. రవీందర్ రావు మాట్లాడుతూ... ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన డేటాను విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
కొన్ని సందర్భాల్లో, ఇది వ్యాధిని కచ్చితంగా నిర్ధారించడానికి, సరైన చికిత్స చేయడానికి, వ్యాధుల నివారణకు వేగవంతమైన మార్గాలను అందించడంలో మానవ నిపుణులతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయగలదని చెప్పారు. ఏఐ డాక్టర్లను భర్తీ చేయలేదని, వారి సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు.