మీరు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే సెట్​ చేస్తున్నం : మంత్రి శ్రీధర్​ బాబు

మీరు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను  ఇప్పుడిప్పుడే సెట్​ చేస్తున్నం : మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తామన్నారు. మాజీ మంత్రి హరీశ్​ రావు కామెంట్లకు మంత్రి శ్రీధర్ బాబు సోమవారం కౌంటర్ ఇచ్చారు. పెన్షన్​పై ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తర్వులిచ్చారని, తెలంగాణలో ఎప్పుడు అమలు చేస్తారన్న హరీశ్​రావు వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు స్పందించారు. ‘‘రాష్ట్ర ప్రజల ఆలోచనలనే మేము అమలు చేస్తం. ఏపీ ప్రభుత్వ ఆలోచనలను కాదు”అని అన్నారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటేనే హరీశ్​రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘పదేండ్ల పాటు మీరు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నం. 3 నెలల పాటు కోడ్ మాకు అడ్డుగా వచ్చింది. కోడ్ ముగిసినప్పటి నుంచి హామీల అమలుకు కసరత్తు చేస్తున్నం. ఆగస్టు 15లోపే రుణమాఫీ పూర్తి చేస్తం’’ అని మంత్రి స్పష్టం చేశారు. 

త్వరలోనే జాబ్ క్యాలెండర్

12 ఏండ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష తామే నిర్వహించామని, త్వరలో జాబ్ క్యాలెండర్​నూ రిలీజ్ చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్​రావుకు లేదన్నారు. బీఆర్ఎస్  హయాంలో ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించారని మంత్రి గుర్తు చేశారు. పెద్దపల్లిలో అత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని శ్రీధర్ బాబు వెల్లడించారు. మత ఘర్షణల విషయంలో సీరియస్​గా ఉన్నామని చెప్పారు. వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.