- ఎస్సీ ఎస్సీ కాంక్లేవ్లో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ‘డిజిటల్ సేఫ్టీ’లో ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్లోనూ రోడ్మ్యాప్ను పొందుపరిచామని తెలిపారు. గురువారం హెచ్ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ఎస్సీ) కాంక్లేవ్ 2025ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయన్నారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17 వేలకు పైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమని గుర్తు చేశారు.
నేరాలను ముందే పసిగట్టే వ్యవస్థ కావాలి
పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందుగానే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేయగలిగే వ్యవస్థ అవసరమన్నారు. అధునాతన టెక్నాలజీల ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి నూతన వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. వారిని వారియర్స్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్ సీఎస్ సీ సెక్రటరీ జనరల్ రమేశ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

