
- ఐటీపీఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
- ఎవరెన్ని అడ్డంకులు
- సృష్టించినా ప్రాజెక్టు ఆగదు
- మంచి చేస్తుంటే కొందరు కావాలనే అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఫైర్
- నగరాలు, ఆర్థికాభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏదైనా మంచి చేసేటప్పుడు కొందరు కావాలని అడ్డుపడుతుంటారని, మూసీ విషయంలోనూ ఇదే జరుగుతున్నదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా భవిష్యత్తు తరాల కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలుపుతామని పేర్కొన్నారు. శనివారం బంజారా హిల్స్లోని పార్క్ హయత్లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగరాల అభివృద్ధికి, ఆర్థిక భవిష్యత్తుకు సరైన ప్రణాళికే పునాది అన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ‘‘భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి అత్యవసరం. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయవచ్చు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలి” అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్ (టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్, ఐటీపీఐ – తెలంగాణ రీజనల్ చాప్టర్ చైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.