- చేనేత రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
యాదాద్రి, వెలుగు : చేనేత రంగంలో -‘ఇక్కత్’కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చేనేత, జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్న ‘థ్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ను శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోచంపల్లి చేనేత కళాకారుల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణం అన్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు, పుట్టపాక తేలియ రుమాళ్లకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత రెండేండ్లలో చేనేత కళాకారుల కోసం సీఎం రేవంత్రెడ్డి రూ. 1400 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
పోటీని తట్టుకునేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు చేశామని, ఈ సంస్థ ద్వారా చేనేత కార్మికుల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. డూప్లికేట్ ఉత్పత్తిలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ చేనేత కళాకారుల శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చీరలు నేరే విధానం, ఒక చీర పూర్తయ్యేందుకు పట్టే సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, హాండ్లూమ్ ఏడీ శ్రీనివాస్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య పాల్గొన్నారు.
