
- బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీనే : కేకే
- రాహుల్ను పప్పు అనడంలో తప్పేమీ లేదు: మంత్రి ప్రశాంత్రెడ్డి
- తెలంగాణ బరాబర్ కేసీఆర్ జాగీరే: మంత్రి జగదీశ్రెడ్డి
- ఆయన ఏ హోదాలో హామీలిచ్చిండు: మంత్రి ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం సభలో రాహుల్గాంధీ ఏ హోదాలో హామీలిచ్చారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ను పప్పు అంటే ఇన్నాళ్లు బాధ పడేవాడినని, ఖమ్మం సభలో ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే పప్పు అనడంలో తప్పేమి లేదనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసి చ్చిన స్క్రిప్ట్నేఆయన చదివి వెళ్లిపోయారని అన్నారు. కాంగ్రెస్లో ఏ పదవి లేకున్నా అన్నీ తానే అయి రాహుల్ పార్టీని నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్ రిమోట్గాంధీలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ఎల్పీలో మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్ మొన్ననే గెలిచిందని, అక్కడ రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ది రాచరికం కాదని, 88 సీట్లతో గెలిచి రెండోసారి సీఎం అయ్యారని చెప్పారు. కాంగ్రెస్లో తానే రాజునని రాహుల్అనుకుంటున్నారని ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఖమ్మంలో తొమ్మిది సీట్లు గెలుస్తం : పువ్వాడ
భారత్జోడో యాత్రతో రాహుల్లో పరిపక్వత వచ్చిందని అనుకున్నానని, ఖమ్మం సభతో అది నిజం కాదని రాహుల్ నిరూపించారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో ఈసారి పది అసెంబ్లీ సీట్లలో తొమ్మిది గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే రూ.4 వేల పింఛన్దేశమంతా అమలు చేయాలన్నారు. ఖమ్మం సభలో దళిత నేత భట్టిని కాంగ్రెస్నేతలు అవమానించారన్నారు. జాతరలకు కూడా జనం వస్తారని, ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్నేతలు జబ్బలు చరుచుకోవద్దని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. చిరంజీవి సభలకు కూడా జనం వచ్చారని, కానీ ఓట్లు మాత్రం వేయలేదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, సండ్ర వెంకటవీరయ్య, జాజాల సురేందర్ పాల్గొన్నారు.