
- రాహుల్ ఆలోచనలకు తగ్గట్టు మంత్రివర్గ విస్తరణ
- ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని వెల్లడి
- ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిసి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, వెలుగు: తన తండ్రి కాకా వెంకటస్వామి బాటలో నడుస్తానని, ఆయన నేర్పించిన రాజకీయ విలువలు పాటిస్తూ ముందుకు వెళ్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంత్రి హోదాలో సోమవారం తొలిసారి వివేక్ ఢిల్లీకి వచ్చారు. తన భార్య సరోజ, కుమారుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిశారు. మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం వంశీకృష్ణతో కలిసి వివేక్ మీడియాతో మాట్లాడారు. తనకు ఏ శాఖ అప్పగించినా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా పని చేస్తానని ఆయన చెప్పారు. తనకు అప్పగించిన శాఖ ఏదన్నది చూడకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని తెలిపారు. ‘‘శాఖల కేటాయింపు సీఎం పరిధిలో ఉంటుంది. ఆయన నాకు ఏ శాఖ కేటాయించినా సమ్మతమే. నా తండ్రి కాకాకు గతంలో రూరల్ డెవలప్మెంట్ శాఖ కేటాయిస్తే.. రూ. 5 వేల కోట్ల బడ్జెట్ ఉన్న చిన్న శాఖ అని అందరూ కామెంట్ చేశారు.
కానీ ఆ శాఖ బడ్జెట్ను రూ. 5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్లు ఇప్పించారు. సింగరేణి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి సంస్థను కాపాడారు. నేను కూడా నా తండ్రి అడుగుజాడల్లో నడిచి.. ఎంపీగా ఉన్నప్పుడు మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాను. ఇందుకోసం నాటి ప్రధాని మన్మోహన్తో మాట్లాడి రూ. 10 వేల కోట్ల రుణమాఫీ చేయించాను. అలా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలకు ఏం చేశామన్నదే మాకు ముఖ్యం” అని పేర్కొన్నారు.
కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం..
సామాజిక న్యాయం చేయాలన్న రాహుల్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిందని వివేక్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అగ్రనేతలు సూచించారు. రానున్న కార్పొరేషన్, లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. ఖర్గేకు రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉంది. ఏయే ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే దానిపై పలు సూచనలు చేశారు. మంత్రిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా సలహాలు, సూచనలు ఇచ్చారు” అని చెప్పారు. తర్వాతి ఢిల్లీ పర్యటనల్లో అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని పేర్కొన్నారు.
ఖర్గేతో అరగంట భేటీ..
మంత్రి వివేక్ వెంకటస్వామి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా 10 రాజాజీ మార్గ్లోని ఖర్గే ఇంటికి వెళ్లారు. తన భార్య సరోజ, కుమారుడు, ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో లోధి రోడ్లోని ఆయన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్కు కేసీ వేణుగోపాల్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం, కులగణన, ఇతర అంశాలపై ఇద్దరూ చర్చించారు.
గాంధీభవన్లో సంబురాలు
రాష్ట్ర మంత్రివర్గంలోకి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను తీసుకున్నందుకు సోమవారం గాంధీ భవన్ లో పీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మీడియాతో మాట్లాడారు. ఆధునిక అంబేద్కర్ లా దళితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని ప్రశంసించారు.