
కోదాడ, వెలుగు : రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా కొత్త టెక్నాలజీతో కోదాడ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తామని భారీ నీటిపారులశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై ఆదివారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో మార్కెట్కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనువైన ప్రాంతంలో ప్రత్యేకంగా పశువుల సంత ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని తెలిపారు. మార్కెట్ అభివృద్ధితోపాటు రైతులకు పొలాలకు వెళ్లే దారులకు మట్టి రోడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం మండలానికి ఒక గోదాం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని మంత్రులను పాలకవర్గ సభ్యులు కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మాసుధీర్, వైస్ చైర్మన్ బషీర్, జిల్లా మార్కెటింగ్ అధికారి శర్మ, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ రాహుల్, మార్కెట్కమిటీ సభ్యులు పాల్గొన్నారు.