
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికి శుభవార్త చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ (గురువారం) కేరళలోని త్రిస్సూర్లో జరిగిన అఖిల భారత మత్స్యకారుల మహసభ నిర్వహించిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో రాహుల్గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తక్షణమే… దేశంలోని మత్స్యకారులందరికీ ఢిల్లీ కేంద్రంగా సొంతంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీ నెరవేర్చి తీరతామని రాహుల్ తేల్చి చెప్పారు. తాను ప్రధాని మోడీలా మోసపూరిత హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు రాహుల్.
అంతకు ముందు త్రిస్సూర్లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడిన రాహుల్… కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే మినిమమ్ గ్యారంటీ ఇన్కమ్ (MGI) పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. MGI కంటే తక్కువ సంపాదించే వారికి మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.