మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసి నీటి సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కోర్టు సెంటర్ నుంచి ఇందిరా గాంధీ సెంటర్, నెహ్రూ సెంటర్, ప్రభుత్వ హాస్పిటల్ మీదుగా మున్సిపాలిటీ ఆఫీసు వరకు ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్నమాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైన్లు ఇంటింటికీ వేస్తామని ప్రకటించి విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా అన్ని కాలనీల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొమ్మన బోయిన అనసూర్య, హలవత్ లింగన్న, లక్ష్మయ్య, సామ పాపయ్య, పర్వత కోటేశ్, ఎండీ జబ్బార్, ఐలయ్య, గుండెల కృష్ణ, యాకయ్య, కవిత, బానోత్ దేవేందర్, చంద్రమౌళి, రజిత, అనిత, ఉపేందర్, ఉమా, లక్ష్మి, నాగరాజు, యాకాంబరం పాల్గొన్నారు.

