
దేవరకొండ, వెలుగు : విద్యారంగంలో మరో ముందడుగు పడిందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం దేవరకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ బిడ్డలు.. ప్రపంచానికే మార్గదర్శకంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెండో విడతలో దేవరకొండ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసిన సీఎం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్యనందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తుందని చెప్పారు. కొలముంతల్ పహాడ్ గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తామని తెలిపారు.
భవన నిర్మాణ పనులకు త్వరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమునామాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.