కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు: కూనంనేని

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు: కూనంనేని

అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవట్లేదన్నారు.  కరెంట్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని విమర్శించారు.  గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడం.. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు.  వంద రోజులు కూడా కాకముందే కేటీఆర్ విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తాము తప్పితే ఎవరికీ పరిపాలన చేసే హక్కులేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న కేటీఆర్ వ్యాఖ్యలను కూనంనేని తప్పుబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కాలేవన్నారు.  బీఆర్ఎస్, బీజేపీకి మద్దతిస్తోందని..ఎప్పటికైనా ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు.  కాంగ్రెస్ తో ఎంఐఎం కలిస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు.  కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలన్నారు కూనంనేని. తమకు ఒకటి లేదా రెండు స్థానాలు ఇవ్వాలన్నారు.  కాంగ్రెస్ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. తమతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే చత్తీస్ ఘడ్ లో  కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని చెప్పారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఒక మతానికి నాయకుడిగా వ్యవహరించొద్దన్నారు. అందరినీ కలుపుకొని పోకుంటే మోదీ నరకానికి వెళతారన్నారు కూనంనేని.