పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించింది. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జ్ గా మదన్ మోహన్ రావును నియమించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మదన్ మోహన్ రావుతో పాటుగా మరికొంతమంది నేతలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి మహబూబ్ నగర్, జగ్గారెడ్డికి మెదక్, రామ్ మోహన్ రెడ్డికి చేవెళ్ల కో ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లితో పాటుగా వరంగల్ కో ఇంఛార్జ్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.