కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్, పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్​చెరు  కేంద్రంగా జోనల్​ ఆఫీసును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆర్వీ  కర్ణన్​ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్​లోని బల్దియా ఆఫీసులో కమిషనర్​ను కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేశారు.

 నియోజకవర్గంలోని ప్రజలు, పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను, సలహాలను కమిషనర్​కు వివరించారు. ప్రధానంగా అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలో లక్ష ఇరవై వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల వరకు జనాభా నివసిస్తున్నారని తెలిపారు. పాత అమీన్​పూర్​ మండలం, అమీన్​పూర్​ మున్సిపల్​ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని, పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్​పూర్​, పీజేఆర్​ కాలనీల పేరుతో ముప్పై వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

 తెల్లాపూర్​ మున్సిపల్​ పరిధిలో తెల్లాపూర్​, ముత్తంగి డివిజన్లు ఏర్పాటు చేశారని, వీటి పరిధిలో గల రెండు పడక గదుల ఇండ్ల సముదాయాల ఓటర్లకు అనుగుణంగా తెల్లాపూర్​, వెలిమెల, కొల్లూరు, ముత్తంగి కేంద్రాలుగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు. తెల్లాపూర్​ పరిధిలోని 450 గృహాలు ప్రస్తుతం భారతీనగర్​ డివిజన్​ పరిధిలో ఉన్నాయని, వీటిని తిరిగి తెల్లాపూర్​ డివిజన్​లో కలపాలని కోరారు. ప్రజలకు, ఇందుకు బల్దియా కమిషనర్​ సానుకూలంగా స్పందించి అభ్యంతరాలను, సలహాలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.