అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, పటాన్చెరు కేంద్రంగా జోనల్ ఆఫీసును ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని బల్దియా ఆఫీసులో కమిషనర్ను కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేశారు.
నియోజకవర్గంలోని ప్రజలు, పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను, సలహాలను కమిషనర్కు వివరించారు. ప్రధానంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష ఇరవై వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల వరకు జనాభా నివసిస్తున్నారని తెలిపారు. పాత అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని, పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్పూర్, పీజేఆర్ కాలనీల పేరుతో ముప్పై వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తెల్లాపూర్, ముత్తంగి డివిజన్లు ఏర్పాటు చేశారని, వీటి పరిధిలో గల రెండు పడక గదుల ఇండ్ల సముదాయాల ఓటర్లకు అనుగుణంగా తెల్లాపూర్, వెలిమెల, కొల్లూరు, ముత్తంగి కేంద్రాలుగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు. తెల్లాపూర్ పరిధిలోని 450 గృహాలు ప్రస్తుతం భారతీనగర్ డివిజన్ పరిధిలో ఉన్నాయని, వీటిని తిరిగి తెల్లాపూర్ డివిజన్లో కలపాలని కోరారు. ప్రజలకు, ఇందుకు బల్దియా కమిషనర్ సానుకూలంగా స్పందించి అభ్యంతరాలను, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
