ఎమ్మెల్సీ పల్లా నారాజ్​! భూకబ్జాలు, అవినీతి అక్రమాలపై ముత్తిరెడ్డి ఆరోపణలు

ఎమ్మెల్సీ పల్లా నారాజ్​! భూకబ్జాలు, అవినీతి అక్రమాలపై ముత్తిరెడ్డి ఆరోపణలు
  • ఖండించని నేతలు.. సపోర్ట్​ చేయని హైకమాండ్​
  • ఇన్నాళ్లూ కేసీఆర్‍తో సమానంగా చూసినోళ్లే ఇప్పుడు నిర్లక్ష్యం
  • 15 రోజులు గడిచినా టికెట్​పై క్లారిటీ ఇవ్వకపోవడంతో పల్లా అసంతృప్తి 

జనగామ/వరంగల్‍, వెలుగు : అధికార బీఆర్‍ఎస్‍లో నిన్నమొన్నటి వరకు సీఎం కేసీఆర్‍ తర్వాత అదే స్థాయిలో గౌరవ, మర్యాదలు పొందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి సొంత జిల్లా ఉమ్మడి వరంగల్​లో క్రమంగా  గ్రాఫ్‍ పడిపోతోంది. ఇప్పటి వరకూ పల్లాకు ఎనలేని గౌరవమర్యాదలు ఇచ్చిన వారే నేడు కుట్రదారు, భూకబ్జాదారు అంటూ ఆరోపిస్తున్నారు. జనగామలో పొలిటికల్​ ఎంట్రీ కోసం హైకమాండ్​ డైరెక్షన్​లో హైదరాబాద్‍లోని హరిత ప్లాజా కేంద్రంగా చేసిన  తెరవెనుక రాజకీయాలే ఆయన ఇమేజ్​ను డ్యామేజీ చేశాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వంటి నేతలు బహిరంగగానే పల్లాపై భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు చేస్తున్నా, దిష్టిబొమ్మలు తగలబెడ్తున్నా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంతవరకూ ఖండించలేదు. కనీసం  బీఆర్ఎస్​ పెద్దలు సపోర్ట్​  చేయకపోవడంపై పల్లా నారాజ్​గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ హైకమాండ్‍  అభ్యర్థుల పేరుల ప్రకటించి15 రోజులు గడిచినా జనగామపై క్లారిటీ ఇవ్వకపోవడం ఆయనకు మరింత అవమానకరంగా మారిందనే చర్చ జరుగుతోంది.

జనగామ ఎంట్రీతో మారిన సీన్​..

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్‍లో సీఎం కేసీఆర్‍ మనిషిగా పల్లా రాజేశ్వర్  రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. డెవలప్​మెంట్​ వర్క్స్, నిధుల విడుదల, వివిధ సమస్యల పరిష్కారం కోసం పల్లాపై ఆధారపడేవారు. ఒకరకంగా కేసీఆర్‍  ముందు ఎలా ఉండేవారో పల్లాతోనూ అదే స్థాయి గౌరవంతో నడుచుకునేవారు. కానీ, జనగామలో పొలిటికల్  ఎంట్రీ కోసం తెరవెనుక పల్లా చేసిన రాజకీయాలు సొంత పార్టీలోనే కలకలం రేపాయి. అభ్యర్థుల ప్రకటనకు వారం ముందే సొంత పార్టీ ఎమ్మెల్యేకు తెలియకుండా తన అనుచరులను గ్రూపుగా తయారుచేసి హైదరాబాద్‍లోని  హరిత ప్లాజా హోటల్ లో సమావేశం కావడం పల్లాకు నెగెటివ్​గా మారింది. ‘‘జనగామ టికెట్​ నేను అడగలేదు. హైకమాండ్​చెప్పిందే చేశాను తప్ప ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా సొంత రాజకీయాలు  చేయలేదు’’ అని పల్లా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా క్యాడర్  నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.

ముత్తిరెడ్డి సవాళ్లతో.. జనాల్లో పలుచన..

తెలంగాణ ఉద్యమకారునిగా, సిట్టింగ్‍  ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జనగామ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‍ ఉంది. ఈ క్రమంలో పార్టీలో పల్లా రాజేశ్వర్‍ రెడ్డి రూపంలో తన పొలిటికల్‍  కెరీర్‍కు ఇబ్బంది వస్తుందని ఆయన ఊహించలేదు. ఒకటి రెండుసార్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍  రెడ్డి తన అనుచరులతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తేనే  రచ్చ చేసిన ముత్తిరెడ్డి.. పల్లా నడిపిన హరిత ప్లాజా రాజకీయాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో జనగామ టికెట్​ను పెండింగ్​ పెట్టడంతో రగిలిపోతున్న పల్లాపై వివిధ వేదికలపై ముత్తిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలోని కొందరు లీడర్లను పల్లా ఆయన వైపు తిప్పుకొని తనకు టికెట్​ రాకుండా కుట్ర చేశారనే విషయాన్ని క్యాడర్​లోకి, జనాల్లోకి ముత్తిరెడ్డి తీసుకెళ్తున్నారు. అలాగే పల్లా అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముత్తిరెడ్డి, ఆయన అనుచరులు ఇటీవలే అర్ధనగ్న ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలు వంటివి చేశారు. హైదరాబాద్‍ బీబీ నగర్‍లో 286 మంది ప్లాట్లను పల్లా తన కొడుకు అనురాగ్‍  రెడ్డి పేరిట కబ్జా చేశారని, దీనిపై ఈడీతో విచారణ చేయాలని బాధితుల తరఫున  ముత్తిరెడ్డి డిమాండ్‍  చేశారు. మొన్నటిదాకా ముత్తిరెడ్డి కుటుంబంలో తండ్రీబిడ్డల మధ్య జరిగిన ఆస్తుల పంచాయితీని కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. జనగామ టికెట్​ కోసం పల్లానే తన బిడ్డతో కుట్ర చేయించారని ఆరోపిస్తూ జనాలను ఆలోచనలో పడేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా తన సొంత గ్రామం సోడాశపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‍, ఇతర పార్టీల నుంచి బీఆర్‍ఎస్‍లోకి వచ్చిన నేతలను కుక్కలతో పోల్చడంపైనా ముత్తిరెడ్డి మండిపడ్డారు. 

హైకమాండ్​ సైలెన్స్​

ముత్తిరెడ్డి, ఆయన అనుచరులు పల్లా రాజేశ్వర్  రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన పరువును బజారుకీడుస్తున్నా ఎమ్మెల్యేను కంట్రోల్​ చేసేందుకు బీఆర్ఎస్  హైకమాండ్​ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పల్లా రాకను ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లితో పాటు ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, చివరికి మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ ఒక్కరు కూడా పల్లాపై ముత్తిరెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించడం లేదు. దీంతో హైకమాండ్​ తీరుపై పల్లా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు  సీఎం కేసీఆర్‍  ఆగస్ట్ 21న బీఆర్ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్‍  చేయగా, జనగామను పెండింగ్‍ లో పెట్టారు. ఫలితంగా చాలా మంది లీడర్లు, క్యాడర్​ ముత్తిరెడ్డితోనే ఉంటున్నారని, ప్రతి అవకాశాన్ని తనను డ్యామేజ్​ చేసేందుకు ఎమ్మెల్యే వాడుకుంటున్నారని పల్లా భావిస్తున్నారు. అలాకాకుండా జనగామ టికెట్​ను వెంటనే తనకు ఖాయం చేస్తే లీడర్లు, క్యాడర్​ అంతా తనవైపు వస్తుందని, అప్పుడు ముత్తిరెడ్డి నోటికి అడ్డుకట్ట పడ్తుందని పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఆయన వర్గీయుల ఆలోచన. కానీ, 15 రోజులు గడిచినా జనగామ అభ్యర్థి ఎవరో హైకమాండ్​  ప్రకటించకపోవడంపై పల్లా అసంతృప్తితో ఉన్నట్లు బీఆర్ఎస్​లో చర్చ జరుగుతోంది.