డాక్టర్ వసంత్‭ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్

డాక్టర్ వసంత్‭ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్

సుల్తాన్ బజార్ యూపీహెచ్సీలో డాక్టర్ వసంత్ మూడు రోజులుగా తలుపులు వేసుకుని దీక్ష చేస్తున్నారు. దీనిపై గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి.. దీక్షను విరమించాలని వసంత్‭ను కోరారు. ఆందోళన చేస్తున్న డాక్టర్‭కు సంఘీభావం తెలిపిన ఆయన.. తలుపులు తెరిచి బయటికి రావాలని అన్నారు. పోలీసులు వెళిపోతేనే బయటకు వస్తానని చెప్పిన వసంత్.. చివరికి తలుపులు తెరిచారు. అతడితో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాజాసింగ్ హామీ ఇచ్చారు. తాను కేవలం రూ.45కే ఐదు రోజుల్లో కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తానని చెబుతున్నా.. అధికారులు,ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

డాక్టర్ వసంత్ అంశం మాట్లాడేందుకు మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వైద్యుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు తగదని అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ వసంత్ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వివరించానని తెలిపారు. ఆయన హైదరాబాద్ రాగానే వసంత్ తో మాట్లాడతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వసంత్ రీసెర్చ్ ను పరిగణలోకి తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.