గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రాజాసింగ్ భార్య పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ ను ఎత్తివేసి.. బెయిల్ ను మంజూరు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు మంగళ్ హాట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) కు నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 19న మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసు ఆధారంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఆగస్టు 25న పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. ఆ రోజున ఆయనను అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు.రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 నుంచి ఇప్పటివరకు మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. మొత్తం 101 కేసుల్లో.. 18 కమ్యూనల్ కేసులేనని తెలిపారు. ఆగస్టు 22న ‘‘శ్రీరామ్ చానెల్ తెలంగాణ’’లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలోనే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను ప్రయోగించారు.