కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా

కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా

జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్ లు వేసి నవ్వుతూ  ప్రేక్షకుల్ని నవ్విస్తున్న రోజా సెల్వమణి కన్నీరు పెట్టుకున్నారు. టీవీ షోలు, రాజకీయాలతో బిజీగా ఉంటూ.. తన పర్సనల్ లైఫ్‌ను మిస్ అవుతున్నానని స్టేజీపైనే  వెక్కి వెక్కి ఏడ్చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో  ఆమె పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఆమె కుమారుడు కృష్ణ లోహిత్ ఒక పాట పాడాడు. దానికి ఉబ్బితబ్బిబ్బైన రోజా.. స్టేజీపైనే తన కుమారుడిని ముద్దాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షూటింగ్స్‌కు, పాలిటిక్స్ అని బయటికి వెళ్లినపుడు తన పిల్లలు బాగా అర్థం చేసుకుంటున్నారని భోరున ఏడ్చేశారు. కష్టపడేదంతా వాళ్ల కోసమేనని, డబ్బు అవసరం లేదు.. అమ్మా! మీరు మాత్రమే కావాలి.. అని అంటారని ఎమోషనల్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. మంగళవారం చిత్తూరు జిల్లా  నగరిలో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో  కలిసి భోగి సంబురాలు జరుపుకున్నారు రోజా. ప్రజల  కష్టాలు దూరమై.. సుఖ సంతోషాలతో  ఉండాలని కోరుకున్నారు.  జగన్ ముఖ్యమంత్రి  అయిన తర్వాత అన్ని వర్గాలకు  సంక్షేమ పథకాలు  అందుతున్నాయన్నారు.  మూడు రాజధానులతో  మూడు ప్రాంతాలు  సుభిక్షంగా  ఉండాలని ఆమె కోరుకున్నారు.