నేను కేయూ అధికారుల బాధితురాలినే..విద్యార్థుల బంద్కు సీతక్క మద్దతు

నేను కేయూ అధికారుల బాధితురాలినే..విద్యార్థుల బంద్కు సీతక్క మద్దతు

సెప్టెంబర్ 12వ తేదీన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వరంగల్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ  బంద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరంలో విద్యార్థులతో కూర్చొని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జాక్ నేతల దీక్షకు మద్దతు తెలిపారు.

ఉద్యమాల, పోరాటాల గడ్డ అయిన వరంగల్కు తలమానికం కాకతీయ యూనివర్సిటీ అని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. త్యాగాల స్ఫూర్తిని నింపుకున్న ఎందరినో కాకతీయ యూనివర్సిటీ దేశానికి అందించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉద్యమ స్ఫూర్తిని చంపేసిందని మండిపడ్డారు. కేయూలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. 

మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాలని అడిగితే సీట్లు ఇవ్వట్లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తోందని మండిపడ్డారు. చదువు కావాలంటే గొర్లు, బర్లు తీసుకోండని ప్రభుత్వం చెప్తోందని ఆరోపించారు. పోలీసులు కూడా అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న పోలీసులు.. విద్యార్థుల గురించి ఆలోచించాలని సూచించారు. స్టూడెంట్స్ ను గుండాలుగా చిత్రీకరించొద్దని కోరారు. విద్యార్థుల చేతులు, కాళ్ళు విరగ్గొట్టారని...ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 
తాను కూడా కేయూ అధికారుల బాధితురాలిని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. సరైన అర్హత ఉన్నా తనకు పీహెచ్డీ అడ్మిషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష రాసి జాయిన్ అయ్యానని...విద్యార్థులను వేధిస్తే..వారు తిరగబడి తరిమి కొడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. విద్యార్థులపై పైశాచిక దాడిని ఖండిస్తున్నామని...వీసీ, రిజిస్ట్రార్ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని...విద్యార్థుల వరంగల్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాని ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు.