గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పై ఎమ్మెల్యే కొడుకు దాడి

గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పై ఎమ్మెల్యే కొడుకు దాడి

గద్వాల/శాంతినగర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో అందరూ చూస్తుండగా సమైక్యత వజ్రోత్సవ సభలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్​పై ఎమ్మెల్యే కొడుకు అజయ్, ఆయన అనుచరులు దాడి చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ శుక్రవారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో నిర్వహించారు. అనంతరం మీటింగ్​జరిగింది. సభ ముగుస్తున్న సమయంలో మిమ్మల్ని ఇక్కడకు ఎవరు పిలిచారంటూ అలంపూర్​ఎమ్మెల్యే కొడుకు అజయ్ తో పాటు ఆయన అనుచరులు రాష్ట్ర కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్​తో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సాయిచంద్​తోపాటు ఆయన గన్ మెన్, అనుచరులపై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఎమ్మెల్యే కొడుకు అజయ్ ను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం సాయిచంద్​ను వెహికల్ లో అక్కడి నుంచి పోలీస్​ఎస్కార్ట్ మధ్య పంపించారు. అలంపూర్ టికెట్ కు అడ్డొస్తున్నారని..అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి అబ్రహం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే నెల రోజులుగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గంలో పర్యటించి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే అబ్రహం వర్గానికి మింగుడు పడడం లేదు. అలంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండడంతోనే ఎమ్మెల్యే కొడుకు ఆయనపై దాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. సాయిచంద్​ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసి తనపై దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు.