జాబ్స్ సంఖ్య కాదు ఎవరికి, ఎక్కడ ఇచ్చారో లెక్క చెప్పాలి

జాబ్స్ సంఖ్య కాదు ఎవరికి, ఎక్కడ ఇచ్చారో లెక్క చెప్పాలి

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను, పట్టభద్రులను మోసగించే ప్రయత్నంలో భాగంగానే 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్పడం సిగ్గు చేటని మండిప‌డ్డారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఖ‌మ్మం-న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న ఆయ‌న‌.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లు సంక్రాంతి బసవన్నల వలే సీజనల్ అబద్ధాలు చెప్పడంలో దిట్టలని అన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఓటమి అంచున ఉన్నద‌ని, తప్పుడు ప్రకటనలతో మోసం చేయాలని చూసి మరింత దిగజారిందని అన్నారు.

ప్రభుత్వం చెబుతున్న 1.32 లక్షల ఉద్యోగాల‌ విషయమై శుక్ర‌వారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారిని క‌లిశామ‌ని, ఆ లెక్కల వివరాలను గంపాగుత్తగా కాకుండా ఏ గ్రామంలోని ఏ నిరుద్యోగికి, ఏరోజు, ఏ నోటిఫికేషన్ ద్వారా, ఉద్యోగాలు ఇచ్చారో అభ్యర్థుల పూర్తి వివరాలతో కూడిన జాబితా ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించి ఉంటే .. రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో ఎందుకు భయపడుతుందని ప్ర‌శ్నించారు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఉద్యోగాలు పొందిన 1.32 లక్షల మందిని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిలబెట్టి చూపాలన్నారు.

ఒక‌వేళ 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ కాలేదని నిరూపిస్తే.. కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తాడా ? అని ప్ర‌శ్నించారు మ‌ల్ల‌న్న‌. 1.32 లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. 7900 మంది ఫీల్డ్ మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లను .. సాక్షర భారత్ కో ఆర్డినేటర్లను ఉద్యోగాల నుంచి తీసివేశార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ , కేటీఆర్ లను నిరుద్యోగులను చేస్తే తప్ప తెలంగాణ లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని మండిప‌డ్డారు. ఇప్పటికే కేసీఆర్ మోసాలను గమనించిన ప్రజలు రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు పట్టం కట్టి టీఆర్ఎస్ పార్టీ అరాచకాల పీచం అణచబోతున్నార‌ని ఆయ‌న అన్నారు.