
ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ తెలంగాణ హక్కు అని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ అమ్మకానికి పెడుతోందని ఫైర్ అయ్యారు. ఏడు మండలాలు, సీలేరు హైడ్రో ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు సరేండర్ అయ్యాని వాపోయారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ మహారాష్ట్రకు ఇస్తామని అనడం నీళ్ళు, నిధులు, నియామకాల స్ఫూర్తికి విఘాతమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఏమైందని ప్రశ్నించారు.