- నాకు ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నయ్
- 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా ఓకే
- కేసీఆర్తో వరుసగా మూడోరోజూ భేటీ
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, మంగళవారం విచారణకు రావడం వీలుకాదని సీబీఐకి కవిత లేఖ రాశారు. సోమవారం ప్రగతి భవన్లో కేసీఆర్తో ఆమె భేటీ తర్వాత ఢిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు లెటర్ పంపారు. ఈ కేసులో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్న తన విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఈ–మెయిల్ అందిందని కవిత తెలిపారు. సీబీఐ వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్నంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని అన్నారు. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ పంపిన నోటీసులకు ఈ నెల ఆరో తేదీన (మంగళవారం) తన నివాసంలో అందుబాటులో ఉంటానని ముందు వెల్లడించానని, అయితే.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరో తేదీన తాను సీబీఐ అధికారులను కలువలేకపోతున్నానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని సీబీఐకి లేఖలో తెలియజేశారు. పైన పేర్కొన్న తేదీల్లో సీబీఐ అధికారులకు అనువైన ఏదో ఒక రోజు సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
వరుసగా మూడు రోజులు కేసీఆర్తో భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ పేర్కొన్న రెండో రోజు (ఈ నెల 2న) సీబీఐ అధికారులు ఆమెకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. కేసులో తెలిసిన సమాచారం తమకు వెల్లడించాలని కవితకు సూచించారు. నోటీసులు అందిన వెంటనే ఈ నెల ఆరో తేదీన తాను అందుబాటులో ఉంటానని, హైదరాబాద్లోని తన ఇంట్లో వివరణ ఇస్తానని సీబీఐ అధికారులకు కవిత సమాచారం ఇచ్చారు. ఆ తర్వాతిరోజు(ఈ నెల 3) నుంచి వరుసగా సోమవారం వరకు మూడు రోజులు ప్రగతి భవన్లో ఆమె సీఎం కేసీఆర్తో సమావేశయ్యారు. వీరి భేటీలో న్యాయనిపుణులు పాల్గొన్నారు. లీగల్ ఎక్స్పర్ట్లు, కేసీఆర్ సూచనతోనే మంగళవారం కాకుండా మరో తేదీన విచారణకు రావాలని సీబీఐకి లేఖ రాశారు.