
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత్ జాగృతి ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం 23 తుగ్లక్ రోడ్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు.
అంతకుముందు మధ్యాహ్నం 4 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అనంతరం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఆమె..రాత్రి 8 గంటలకు అక్కడి ఎయిర్ పోర్టులో దిగారు. అటు మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. ప్రగతిభవన్ లో తండ్రి, సీఎం అయిన కేసీఆర్ తో సమావేశం అవుతారని అందరూ భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంటి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు, కొంత మంది పార్టీ నేతలు ఉన్నారు. భారీ కాన్వాయ్ తో ఆమె ఎయిర్ పోర్టుకు బయలుదేరి..ఢిల్లీకి వెళ్లారు.
మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకాలేనని.. 15వ తేదీ తర్వాత వస్తానంటూ ఈడీకి లేఖ రాశారు కవిత. ఈ లేఖపై ఈడీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో 11వ తేదీ హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత రెండో లేఖ పంపారు. అయితే ఈ లేఖలపై ఈడీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈడీ ఎదుట కవిత హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మార్చి 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు సాధన దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే కవిత.. ఢిల్లీకి వెళ్లారు.