
తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందును పోలీసులు బహిష్కరించారు. మొన్న సీఐని తిట్టడంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేందర్ రెడ్డికి ఎస్కార్ట్ భద్రత కల్పించలేమని పోలీసులు తెలిపారు. వారం క్రితమే ఇఫ్తార్ విందుకు మహేందర్ రెడ్డి ఆహ్వానాలు పంపారు. అయితే మొన్నటి వరకు మహేందర్ రెడ్డికి ఎస్కార్ట్ తో భద్రత కల్పించారు పోలీసులు. ప్రస్తుతం MLC, MLA విడివిడిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇవాళ తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. అయితే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందుకు దూరంగా ఉన్నారు పోలీసులు.
మాజీ మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. తాండూర్ సిఐ రాజేందర్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో రెండు రోజు ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులకు రెడ్ కార్పెట్ వేయడంపై మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్ కార్పెట్ ఎందుకు వేశారంటూ కోపంతో ఊగిపోయిన టీఆర్ఎస్ నేత.. అసభ్య పదజాలంతో సీఐపై విరుచుకుపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్డియారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫైలట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొంది. వీరిద్దరి పోరుతో తాండూరులో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయాందోళనకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.