పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకట్లే

పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకట్లే

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతుంటే.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలకు అభ్యర్థులే దొరకటం లేదన్నారు TRS నాయకుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.  ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేరు,అంశాలు లేవని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల గురించి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ఏదో ఉద్దరించినట్టుగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని గమనించక పోవటం దురదృష్టకరమని అన్నారు.

“ఎన్నికల గురించి కాంగ్రెస్, BJP పార్టీల నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇప్పటి వరకు 30 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రేవంత్ లాంటి పనికి రాని వాళ్లు హుజూర్ నగర్ లోనూ  మాట్లాడారు. అక్కడ ప్రజలు మాకు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ప్రతి ఇంటి ముందు కారు గుర్తు ముగ్గులు వేస్తున్నారు. ప్రతిపక్షాలను వారు బండకేసి కొడతారు అని” రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మ్యానిఫెస్టో ను ఐదేళ్లలో అమలు చేస్తారు, తాము సంవత్సర కాలంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. మున్సిపాలిటీలు ఒక్క రోజులో బాగుపడవని, ఇప్పుడే ప్రారంభించామని, దశల వారీగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాము ఎమ్మెల్సీ అన్నారు.