- సెప్టెంబర్లో ఎక్స్పోర్ట్ అయిన రూ.8,200 కోట్ల విలువైన మొబైల్స్
- ఏప్రిల్‑సెప్టెంబర్ మధ్య రూ.34,440 కోట్ల విలువైన ఎగుమతులు
- పీఎల్ఐ వలన లోకల్గా ప్రొడక్షన్ పెంచిన యాపిల్, శామ్సంగ్
న్యూఢిల్లీ: దేశం నుంచి రికార్డ్ లెవెల్లో మొబైల్ ఫోన్లు సెప్టెంబర్లో ఎగుమతయ్యాయి. కిందటి నెలలో ఏకంగా రూ. 8,200 కోట్ల (ఒక బిలియన్ డాలర్ల) విలువైన మొబైల్ ఫోన్లు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ప్రభుత్వం తెచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ సక్సెస్ అవ్వడంతో దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ భారీగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్, శామ్సంగ్లు తమ ప్రొడక్షన్ను ఇండియాలో పెంచాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 4.2 బిలియన్ డాలర్ల (రూ.34,440 కోట్ల) విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అయినట్టు అంచనా. కిందటేడాది ఇదే టైమ్లో 1.7 బిలియన్ డాలర్ల (రూ.14 వేల కోట్ల) విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరిగాయి. నెలవారీగా చూస్తే కిందటి నెలలోనే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. కిందటేడాది డిసెంబర్లో 770 మిలియన్ డాలర్ల (రూ.6,314 కోట్ల) విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి జరగగా, ఇదే ఇప్పటి వరకు అత్యధిక ఎగుమతులు జరిగిన నెలగా కొనసాగింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య మొబైల్ ఎగుమతులు 700 మిలియన్ డాలర్ల దగ్గర రికార్డవుతున్నాయి. కిందటి నెలలో ఎగుమతి అయిన మొబైల్ ఫోన్ల విలువ 200 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగినట్టు తెలుస్తోంది. ‘ఈ గ్రోత్ను కొనసాగించేందుకు టారిఫ్లు తగ్గించి మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలని చూస్తున్నాం. లాజిస్టిక్స్ను మెరుగుపరచడం, లేబర్ రీఫార్మ్స్ తీసుకురావడం, మొత్తం ఎకోసిస్టమ్ను మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి పెట్టాం’ అని ఇండియా సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది.
యాపిల్, శామ్సంగ్ ఫోన్లే ఎక్కువ..
కిందటి నెలలో ఎగుమతైన మొబైల్ ఫోన్లలో యాపిల్, శామ్సంగ్ ఫోన్ల వాటానే 75–80 శాతం ఉంటుంది. 2016–17 టైమ్లో దేశంలో రూ. 90 వేల కోట్ల మొబైల్ ఫోన్లు తయారు కాగా, ఇందులో కేవలం ఒక శాతం ఫోన్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. 2021–22 లో లోకల్గా ఫోన్ల తయారీ రూ.2.75 లక్షల కోట్లకు పెరగగా, ఇందులో ఎగుమతుల వాటా 16 శాతానికి ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫోన్ల ప్రొడక్షన్లో ఎగుమతుల వాటా 22 శాతానికి (రూ.73,800 కోట్లకు) పెరుగుతుందని ఐసీఈఏ అంచనావేస్తోంది. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పెరగడానికి ప్రధాన కారణం 2020 లో తెచ్చిన పీఎల్ఐ స్కీమ్ అని చెప్పాలి. లోకల్గా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లను తయారు చేసే కంపెనీలకు రూ.40,995 కోట్ల రాయితీలను పీఎల్ఐ కింద ప్రభుత్వం ఇస్తోంది. దీంతో యాపిల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలయిన ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగట్రాన్లు, శామ్సంగ్ లోకల్గా తమ ప్రొడక్షన్ పెంచాయి. ఇప్పటికీ మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా, వియత్నాంలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. పీఎల్ఐ స్కీమ్ వలన రానున్న కాలంలో ఈ దేశాలకు పోటీగా ఇండియా ఎదుగుతుందనే అంచనాలు పెరిగాయి. ప్రభుత్వం కూడా 2025–26 నాటికి దేశం నుంచి 60 బిలియన్ డాలర్ల (రూ.4.92 లక్షల కోట్ల) విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అవుతాయని అంచనావేస్తోంది. ఒకప్పుడు దేశం నుంచి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యే మొబైల్ ఫోన్లు, ప్రస్తుతం యూకే, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకూ వెళ్తున్నాయి. ఐసీఈఏ డేటా ప్రకారం, మొత్తం ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్లో 10.2 బిలియన్ డాలర్ల (రూ.83,640 కోట్ల) కు పెరిగింది. 2021–22 లో రికార్డయిన 6.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 54 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య పెరిగిన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ల ఎగుమతుల్లో 68 శాతం వాటా మొబైల్ ఫోన్లదే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ల ఎగుమతులు 20 బిలియన్ డాలర్ల (రూ.1.64 లక్షల కోట్ల) కు చేరుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 2024 నాటికి టాప్ ఐదు ఎక్స్పోర్ట్ దేశాల్లో ఇండియా చోటు దక్కించుకుంటుందని పేర్కొన్నాయి.
‘భవిష్యత్కు ఏది ముఖ్యమో ఒక్కసారి ఆగి, అర్థం చేసుకోని చూడండి. 2025‑26 నాటికి 60 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లే టార్గెట్. దేశాన్ని ఎక్స్పోర్ట్ హబ్గా మార్చే పాయింట్ ఇది. పీఎల్ఐ బాగా సక్సెస్ అవ్వడంతో, 60 బిలియన్ డాలర్ల టార్గెట్ను చేరు కోవ డంలో ఎదు రొచ్చే అడ్డంకులన్నిం టిని ప్రభుత్వం క్లియర్ చేయాలి’ అని పీఎల్ఐ సక్సెస్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.