- నీట్, జేఈఈలే టార్గెట్గా.. ఇక మోడ్రన్ కస్తూర్బాలు
- ప్రయోగాత్మకంగా నిర్మల్లో స్పెషల్ కేజీబీవీ
- ప్రతి కస్తూర్బా నుంచి ఐదుగురు స్టూడెంట్ల ఎంపిక
- కార్పొరేట్ తరహాలో కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు
నిర్మల్, వెలుగు : కేజీబీవీ స్టూడెంట్స్కు కార్పొరేట్ విద్యా సంస్థలతో సమానంగా నీట్, జేఈఈ కోచింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోనే ఫస్ట్ టైం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మ కంగా ‘మోడ్రన్ కస్తూర్బా’ పేరిట ఒలింపియాడ్ తరహాలో కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీఈవో డాక్టర్ రవీందర్రెడ్డి రూపొందించిన యాక్షన్ ప్లాన్కు రాష్ట్ర విద్యాశాఖ కూడా ఆమోదం తెలిపింది. సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచే ఈ ఒలింపియాడ్ స్కూల్ నిర్వహణ చేపట్టనున్నారు.
స్పెషల్ ఎంట్రెన్స్ ద్వారా స్టూడెంట్ల ఎంపిక
రాష్ట్రంలో ప్రస్తుతం 475 టైప్ 2, టైప్ 3 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు నడుస్తున్నాయి. అలాగే మోడల్ స్కూల్స్కు అనుబంధంగా మరో 172 స్కూల్స్, 49 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా కేజీబీవీ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా 5,200 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఈ కేజీబీవీల నుంచే ఒలింపియాడ్ స్కూల్ కోసం స్టూడెంట్లను ఎంపిక చేయనున్నారు. ఆరో తరగతి మొదలుకొని టెన్త్ వరకు టాప్ 5 ర్యాంకులు సాధించిన వారిని ప్రత్యేక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఒలిపింయాడ్ స్కూల్కు ఎంపిక చేస్తారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచే నిర్మల్లో ఒలింపియాడ్ స్కూల్ను స్టార్ట్ చేయనున్నారు.
ఆధునిక సౌకర్యాలతో స్కూల్ ఏర్పాటు
ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఒలింపియాడ్ సిలబస్ను అమలు చేయనున్నారు. స్పెషల్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో పాటు, స్టూడెంట్లకు పోషకాహారాన్ని అందించనున్నారు. నీట్, జేఈఈ ఎగ్జామ్స్ను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిలబస్కు అనుగుణంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతున్న బుక్స్ను స్టూడెంట్లకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు పోటీ పరీక్షల కోచింగ్లో అనుభవం ఉన్న వారిని ఫ్యాకల్టీగా నియమించనున్నారు.
ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం
నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కేజీబీవీ స్టూడెంట్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక ఒలింపియాడ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నాం. ఈ అకడమిక్ ఇయర్ నుంచే క్లాస్లు స్టార్ట్ చేస్తాం. ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు స్టూడెంట్లకు ఎంట్రెన్స్ నిర్వహించి ఎంపిక చేస్తాం.
- రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా