
FASTag: రహదారులపై సాఫీగా ప్రయాణం చేసేందుకు, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఫాస్ట్ట్యాగ్ తీసుకురాబడిందని మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనిని టోల్ చెల్లింపులకు మాత్రమే పరిమితం చేయకూడదలని మోదీ సర్కార్ భావించటం లేదని తెలుస్తోంది.
ఫాస్ట్ట్యాగ్లను ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, పార్కింగ్ వంటి చెల్లింపులతో పాటు వాహన బీమా చెల్లింపులకు కూడా ఉపయోగించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ చర్యలు వాహనదారులకు సౌలభ్యాన్ని పెంచటంతో పాటు సాంకేతికత మెరుగైన వినియోగానికి దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ఫాస్ట్ట్యాగ్లను ఇలా మల్టిపుల్ అవసరాల చెల్లింపులకు వినియోగించటం ద్వారా సూపర్ ట్యాగ్గా మార్చాలని చూస్తోంది.
ఫాస్ట్ట్యాగ్ సేవల విస్తరణ కోసం NHAI కింద పనిచేసే ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా దేశంలోని ఫిన్ టెక్ కంపెనీలతో వర్క్ షాప్ నిర్వహించింది. FASTag వ్యవస్థ కోసం కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సదరు సంస్థలను కోరింది. కేవలం టోల్ చెల్లింపులకు మాత్రమే కాకుండా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను ఎక్కడెక్కడ వినియోగించటానికి అవకాశం ఉందనే అంశాన్ని గుర్తించాలని వారిని కోరింది. అలాగే వాటికి సంబంధించిన నియమాలు, ఫిర్యాదుల పరిష్కారం, భద్రత గురించి కూడా చర్చించబడ్డాయి.
అలాగే వర్క్షాప్లో చర్చించబడిన మరో ముఖ్యమైన అంశం 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' టోలింగ్ వ్యవస్థ. ఇది టోల్ ప్లాజా వద్ద ఎటువంటి అడ్డంకులు లేని సాంకేతికత. దీని ద్వారా వాహనం టోల్ గేట్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు దోహదపడుతుంది. ఈ సాంకేతికత ద్వారా FASTag లేదా వాహన నంబర్ ప్లేట్ను రీడ్ చేయటం ద్వారా టోల్ వసూలు చేయబడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ అభివృద్ధిలో ఫిన్టెక్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం దేశంలోని టోల్ చెల్లింపుల్లో 98.5 శాతం ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థ కేవలం టోల్ చెల్లించడం కంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని ఉందని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు.