ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. రాఫెల్ యుద్ద విమానాలు కొనుగోలుకు సంబంధించిన ముఖ్య డాక్యుమెంట్స్ చోరీకి గురైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈవిషయంపై రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాఫెల్ ఫైల్స్ మిస్సైన అంశంలో మీడియాను కూడా విచారించాలని ప్రభుత్వం అంటోందని, కానీ ఆ డీల్లో 30 వేల కోట్లు చోరీ చేసిన వ్యక్తిని కూడా విచారించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఆ అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. రహస్య పత్రాల్లో ఉన్న వ్యక్తులను కూడా విచారించాలన్నారు. మోడీని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ ఒప్పందాన్ని రూటు మార్చేందుకు మోడి బైపాస్ సర్జరీ చేశారని ఆ రహస్య పేపర్లలో ఉందని, మరి ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మోడీని కూడా దర్యాప్తు చేయాలన్నారు. పత్రాలను మాయం చేయడమే మోడీ సర్కారు పని అని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్లో మోడీ సమాంతరంగా చర్చలు నిర్వహించారని గల్లంతు అయిన డాక్యుమెంట్లు ఉన్నట్లు చెప్పారు.
అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే.. రాఫెల్ విమానాల అప్పగింత ఆలస్యంగా మారుతోందని రాహుల్ అన్నారు. ఒకవేళ ఈ డీల్లో మోడీ తప్పులేకుంటే, మరెందుకు ఆయన విచారణకు హాజరు కావడం లేదన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. మీడియా ధైర్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టే, వారిని విచారించాలని మోడీ సర్కారు ప్రయత్నిస్తోందర్నారు. మోడి కి వ్యతిరేకంగా నిలబడే సత్తా మీడియాకు ఉందన్నారు.