చేవెళ్ల, వెలుగు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శంకర్పల్లి మండలం మోకిలా తండాకు చెందిన సర్పంచ్ వర్త్య శాంతమ్మను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సర్పంచ్ కొడుకు వర్త్య బాబు నాయక్ తన అనుచరులతో కలిసి గతేడాది డిసెంబర్ 25న గ్రామ పంచాయతీ ప్రహరీ, మెయిన్ గేట్, టాయిలెట్లతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.
చెట్లను కూడా నరికివేశారు. ఈ విషయంపై కలెక్టర్ జనవరి 12న సర్పంచ్ శాంతమ్మకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆమె 19న వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని కలెక్టర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు ఉప సర్పంచ్ కవిత సర్పంచ్ బాధ్యతలను నిర్వర్తించాలని ఆదేశించారు.
