దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ 12వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ 12వేలు దాటిన కేసులు

ఇండియాలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం (ఏప్రిల్ 22న) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..  దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. ఏప్రిల్ 21న 42 మంది చనిపోయారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ‘కొవిడ్‌ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. వైరస్‌ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 21) ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.

కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ.. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్  రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. కరోనా వైరస్ నిర్మూళనకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు.