మొరాకోలో భారీ భూకంపం 1,037 మంది మృతి

మొరాకోలో భారీ భూకంపం 1,037 మంది మృతి
  • 1,200 మందికి పైగా గాయాలు
  • వందలాది మంది పరిస్థితి విషమం
  • టూరిస్ట్ ప్లేస్ మారకేశ్ సహా ఐదు చోట్ల విధ్వంసం 
  • భయంతో రోడ్లపై పరుగులు పెట్టిన జనం 
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 
  • మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ 
  • సాయం అందిస్తామని ప్రపంచ దేశాల ప్రకటన

మారకేశ్ (మొరాకో): ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి టూరిస్ట్ ప్లేస్ మారకేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద బిల్డింగులు నేలకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 1,037 మంది చనిపోయారు. మరో 1,200 మంది గాయపడ్డారు. వీరిలో వందలాది మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శుక్రవారం రాత్రి 11:11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ఆ తర్వాత 19 నిమిషాలకు 4.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చిందని చెప్పింది. మారకేశ్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ హౌజ్ ప్రావిన్స్ లోని ఇఘిల్ సిటీలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. 

నిద్రలోనే కొంతమంది మృతి.. 

రాత్రి ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. అప్పటికే నిద్రపోయినోళ్లు ఉలిక్కిపడి లేచారు. ఇంట్లోని సామన్లు ఒక్కసారిగా కదలడంతో భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. రాత్రి 11:11 గంటలకు కొన్ని సెకండ్లపాటు వచ్చిన భూకంపానికి బిల్డింగులు నేలకూలాయి. కొంతమంది నిద్రలోనే చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకుని జనం హాహాకారాలు పెట్టారు. ‘‘ఒక్కసారిగా బిల్డింగులన్నీ కదిలిపోయాయి. నేను భయంతో బయటకు పరుగులు పెట్టాను. అప్పటికే రోడ్డుపైన చాలామంది ఉన్నారు. అందరూ ఏం జరుగుతోందనే షాక్ లో ఉండిపోయారు” అని మారకేశ్ వాసి అబ్దెల్ హక్ అమ్రానీ చెప్పారు. ‘‘భూమి కంపించిన టైమ్​లో నా బెడ్ గాల్లోకి ఎగిరినట్టు అనిపించింది. వెంటనే బయటకు పరుగులు పెట్టాను. రోడ్డుపైన మొత్తం జనం గుమిగూడారు. ఆ ప్రాంతమంతా ఏడుపులు, కేకలతో దద్దరిల్లింది” అని మైఖేల్ వాపోయారు. ‘‘జనం అందరూ భయంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. పిల్లాపాపలతో రోడ్లపైనే ఉండిపోయారు. భూప్రకంపనలు తగ్గిన తర్వాత కూడా మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో లోపలికి వెళ్లడానికి వణికిపోయారు. నేను, నా కుటుంబం రాత్రంతా రోడ్డుపైనే ఉన్నాం” అని బ్రహిమ్ హిమ్మి చెప్పారు.

రాత్రంతా బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే..

భూకంప వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిల్డింగులు కూలిపోతున్నప్పుడు, జనం కేకలు పెడుతూ రోడ్లపై పరుగులు పెడుతున్నప్పుడు తీసిన వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కొంతమంది సరదాగా వీధిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు, మరికొంత మంది టూరిస్టులు ఓ చారిత్రక ప్రదేశ అందాలను చూస్తున్నప్పుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో వాళ్లందరూ భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు అందులో ఉన్నాయి. మారికేశ్ సిటీలో ఇండ్లు, హోటళ్లు, హాస్టళ్లు.. ఇలా అన్నింటినీ ఖాళీ చేసి జనం కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చేశారు. రాత్రంతా పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే ఉన్నారు. సిటీ అందాలను చూద్దామని వచ్చిన టూరిస్టులు.. భూకంపంతో భయాందోళనకు గురయ్యారు. 

గత 50 ఏండ్లలో అతి పెద్ద భూకంపం.. 

గత నాలుగైదు దశాబ్దాలలో మొరాకోలో వచ్చిన అతి పెద్ద భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. 1960లో అగాదిర్ సిటీలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని, అప్పుడు వేలాది మంది చనిపోయారని చెప్పారు. 2004లో అల్ హోసిమా సిటీలో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని, అప్పుడు 600 మందికి పైగా చనిపోయారని పేర్కొన్నారు.

కరెంట్ కట్.. రోడ్లు బ్లాక్ 

భూకంప ధాటికి మారకేశ్, దాని చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రామాలు మొదలు కొండ ప్రాంతాల వరకు ఆయా ఏరియాల్లో పరిస్థితి భీతావహంగా మారింది. ముఖ్యంగా మారకేశ్​లో తీవ్ర నష్టం జరిగింది. పట్టణంలోని చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. 12వ శతాబ్దానికి చెందిన మసీదు డ్యామేజ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయింది. శిథిలాలతో రోడ్లు మొత్తం బ్లాక్ అయ్యాయి. దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా ఉందని అధికారులు చెప్పారు. రోడ్లను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వర్కర్లు, రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని.. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

అండగా ఉంటాం: మోదీ 

మొరాకో భూకంపంపై ప్రపంచ దేశాల నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మొరాకోకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘‘ఈ కష్ట సమయంలో ప్రపంచమంతా మీతో ఉంటుంది. మీకు అవసరమైన సాయం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని మన దేశ ప్రధాని మోదీ చెప్పారు. మొరాకోను ఆదుకుంటామని రష్యా, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, తైవాన్, యూఏఈ, అల్జీరియా, ఇజ్రాయెల్, ఇటలీ, టునీషియా, రొమేనియా తదితర దేశాలు ప్రకటించాయి.