
- మొత్తం 47 కంప్లయింట్స్.. స్వీకరించిన హైడ్రా చీఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి సోమవారం 47 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా పాత లేఅవుట్లు, నాలాల ఆక్రమణలపైనే ఉన్నాయి. గూగుల్, ఎన్ఆర్ఎస్సీ, గ్రామీణ మ్యాప్స్తో ఫిర్యాదులను కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. పాత లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని భరోసా ఇచ్చారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్లో మాదిరే నాలాలు ఆక్రమించి నిర్మించిన ఇండ్లు, అపార్టుమెంట్లు కొనేటప్పుడు అన్ని సరి చూసుకోవాలన్నారు. నాలాల మీద స్లాబులు వేసి ఆక్రమిస్తున్నారని ప్రజావాణిలో పలువురు ఫిర్యాదు చేశారు.
నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం సాధ్యం కాక పూడుకుపోతున్నాయని కంప్లయింట్లో పేర్కొన్నారు. మల్కాజిగిరి, బాచుపల్లి, సికింద్రాబాద్లోని పద్మారావునగర్, మాదాపూర్ ఇలా నగరం నలువైపుల నుంచి నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులందాయి. వీటితో పాటు ఒకప్పటి గ్రామపంచాయతీ లేఅవుట్లను తిరిగి వ్యవసాయ భూములుగా చిత్రీకరించి తప్పుడు పాస్ పుస్తకాలతో కొంతమంది వారసులు, కబ్జా దారులు కాజేస్తున్నారని పలువురు వాపోయారు.
ఫిర్యాదులు ఇలా..
1. మేడ్చల్– - మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ, కొర్రెముల గ్రామం 739 నుంచి 749 వరకూ ఉన్న సర్వే నంబర్లలో 147 ఎకరాల్లో ఏకశిలానగర్ లేఅవుట్ల్ను 1985లో వేశారు. 2006లో ఇందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా మార్చేసి లే ఔట్ స్వరూపాన్నే మార్చేశారు. దీంతో ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లేఅవుట్లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
2. కొర్రెముల గ్రామంలోనే 796 సర్వే నంబర్లో 11.20 ఎకరాల భూమి ఉందని, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని, మిగతా 4 ఎకరాలు తమది కాగా, అందులో, నదెం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు.
3. పంజాగుట్ట కాలనీలోని ఆఫీసర్స్ కాలనీలో వెయ్యి గజాల పార్కు స్థలం ఉండేదని,ఇందులోని 500 గజాల స్థలంలో దుర్గాభవానీ ఆలయాన్ని నిర్మించారని, మిగిలిన 500 గజాల స్థలం కబ్జా కాకుండా పార్కును అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. ఆలయంతో పాటు చుట్టూ ఉన్న దుకాణ సముదాయాల ఆదాయంతో పార్కును అభివృద్ధి చేసేలా చూడాలని కోరారు. శ్రీనగర్ నుంచి వచ్చే వరద కాలువ తమ కాలనీకి ఆనుకుని వెళ్లేదని, ఇప్పుడు కాలువ మాయం కావడంతో వరదంతా తమ ఇండ్లను ముంచెత్తుతోందని వాపోయారు.
బల్దియాకు 74 ఫిర్యాదులు
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 74 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యూబీడీ విభాగం 3, హెల్త్, అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలకు రెండు చొప్పున అందాయి. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో 91 ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ లో 147, రంగారెడ్డిలో 68 హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 147 ఫిర్యాదులు రాగా, రంగారెడ్డిలో 68, వికారాబాద్లో 84 ఫిర్యాదులు అందాయి.