మేడ్చల్ లో ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ

మేడ్చల్ లో ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ

మేడ్చల్, వెలుగు :  ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు ఓ తల్లి జన్మనిచ్చిన ఘటన మేడ్చల్ మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మేడ్చల్ మండల పరిధిలోని రాజ బొల్లారం గ్రామానికి చెందిన సులోచన(22)కు మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. సులోచన ప్రెగ్నెంట్ కావడంతో గురువారం ఆమెను కుటుంబ సభ్యులు మేడ్చల్ మండల పరిధిలోని ఘనపూర్ లో ఉన్న మెడిసిటీ ఆసుపత్రిలో చేర్చారు.

కాన్పులో సులోచన ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన మాట్లాడారు. తమ ఆసుపత్రి చరిత్రలో ఇలాంటి కాన్పు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. పిల్లలు కాస్త తక్కువ బరువుతో జన్నించినందున హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి సులోచన క్షేమంగా ఉందని డాక్టర్ కల్పన స్పష్టం చేశారు.